● వాహనాల యజమానుల నుంచి
కమీషన్లు
● తాజాగా సెక్యూరిటీ
సూపర్వైజర్పై దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు రెచ్చిపోతున్నారు. ఏమి చేసినా తమను అడిగేవారు లేరంటూ హద్దుమీరి ప్రవరిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొద్ది రోజులుగా విండ్ పవర్లో పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నాయకుడు తాజాగా సెక్యూరిటీ సూసర్వైజర్పై దాడికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం యర్రగుడి సమీపంలోని కొండల్లో ఇండో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ విండ్ వపర్ (గాలిమరలు) ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలో ఎవరైనా వాహనాలు, జేసీబీలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజగోపాల్ వారి నుంచి నెలకు కొంత మొత్తాన్ని కమీషన్గా ఇవ్వా లని వాహనాల యజమానులను బెదిరిస్తూ వచ్చాడు. అలాగే అక్కడ పని చేస్తున్న కొందరిని మచ్చిక చేసుకు ని హవా నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీన యర్రగుడి సమీపంలో విండ్పవర్ వద్ద సెక్యూరిటీ సూసర్వైజర్ శ్రీనివాస యాదవ్పై రాజగోపాల్ దాడి చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విండ్ పవర్ సంస్థకు యాక్ట్వ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ సంస్థ 84 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. అయితే ఏజెన్సీ నుంచి వచ్చే వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా మధ్యవర్తులు కోత విధిస్తున్నారంటూ వైఎస్సార్ కడప జిల్లా వద్దిరాలకు చెందిన సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసయాదవ్ సంస్థలోని ప్రతినిధులను ప్రశ్నిస్తూ వచ్చాడు. గార్డులు సైతం ఈ విషయంలో మద్దతు పలికారు. అందరూ సంతకాలు చేయడంతో కొద్ది రోజుల క్రితం జిల్లా కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
దాడి చేసి.. వేటు వేసి!
వేతనాల విషయంలో గార్డుల కడుపుకొడుతున్నారని శ్రీనివాస యాదవ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే తరచూ ప్రశ్నిస్తునందుకు అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో ఏజెన్సీకి చెందిన కొంత మంది ప్రతినిధులు శ్రీనివాస యాదవ్ను తెలంగాణ రాష్ట్రం నల్గొండకు బదిలీ చేయడంతో వెళ్లేదిలేదని భీష్మించాడు. అయితే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గార్డులు సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం అతను సైట్లోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు రాజగోపాల్ సంబంధం లేక పోయినా ఐదారుగురిని వెంట తీసుకెళ్లి శ్రీనివాస యాదవ్ను దుర్బాషలాడి దాడికి దిగాడు. గార్డులు అడ్డుపడి కాపాడారు. చివరకు గార్డుల వేతనాల వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. ఏజెన్సీ ప్రతినిధులు, సెక్యూరిటీ సూపర్వైజర్తో మంతనాలు చేపట్టారు. చివరకు అతనికి చెందిన బకాయిలన్నీ ఇచ్చి, నల్గొండకు వెళ్లేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.


