క్రిష్ణదొడ్డిలో
జనసందోహం మధ్య సాగుతున్న
శ్రీ వారి రథోత్సవం
సి బెళగల్: మండల పరిధిలోని క్రిష్ణదొడ్డి గ్రామంలో కొండపై వెలసిన శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా సాగింది. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామికి భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజార్లు గణపతి పూజ, సంప్రోక్షణ గావించి అర్ధరాత్రి 12 గంటలకు కుంభం ప్రారంభించారు. కుంభం కాగు రథం దగ్గరకు చేరుకోగా శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు మహారథోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకను వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు.
పార్వేటకు బయలుదేరిన స్వామి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పూజార్లు వేంకటేశ్వర స్వామికి పార్వేట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రీవారు, అమ్మవారి సమేత ఉత్సవ విగ్రహాలను అశ్వ, గజారోహణం తదనంతరం పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. శనివారం ఆది దంపతులకు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


