● ఎమ్మెల్సీ ఇసాక్బాషా
బొమ్మలసత్రం: ఆర్ధికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరు తో అప్పులపాలు చేయొ ద్దని సీఎం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా హితవు పలికారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ.. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అమీర్, ఎస్ఈసీ మెంబర్లు గోపవరం సాయినాథరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రెటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసాతో కలసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి కొన సాగుతూ శాసనసభలో అడ్డుకొనే వారు లేక పోయినా అత్యవసర తీర్మానం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తిరిగి గెలవలేరేమో అన్న అనుమానం బలంగా ఉండటంతోనే రాజధానిని మార్చకుండా ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం మొదటి దశకు రూ. 1 లక్ష కోట్లు, రెండవ దశకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయటం చూస్తే భవిష్యత్తులో రాష్ట్రం ఎలాంటి దుస్థితికి వెళ్తుందోనని ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారన్నారు. భవన నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో ఒక చదరపు అడుగు రూ. 11 వేల ప్రకారం ఖర్చు చూపడం చూస్తే రాజధాని పేరుతో దోపిడికి పాల్పడుతున్నారన్న అనుమానం రాకతప్పదన్నారు. రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాలు భూములు సరిపోవని మరోసారి భూసేకరణ చేయటం వెనుక నేతలకు ఆభూములను రియల్ ఎస్టేట్ దందా చేసేందుకేనని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షులు టీవై శివయ్య, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, లీగల్సెల్ అధ్యక్షులు రామసుబ్బయ్య, సెక్రటరీలు దేవనగర్బాషా, శివనాగిరెడ్డి, మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్ పాల్గొన్నారు.


