ఉరుసుకొచ్చి.. చోరీకి స్కెచ్ గీసి!
● బంగారు దుకాణంలో చోరీ
దొంగల అరెస్ట్
● రూ. 40 లక్షల బంగారు,
వెండి ఆభరణాలు స్వాధీనం
బనగానపల్లె: మూడు రోజుల్లోనే బంగారు దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బనగానపల్లె పట్టణంలో సంచలమైన చోరీ కేసులో దొంగలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్ట్ చేశారు. అపహరించిన 18 తులాల బంగారు, 8 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగల వివరాలను బుధవారం డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. బనగానపల్లె పట్టణంలోని పీర్లచావిడి పక్కభాగంలో ఉన్న శ్రీనివాస జ్యువెలర్స్ దుకాణంలో దొంగలు ఈ నెల 7వ తేదీ రాత్రి దాదాపు రూ.40 లక్షల విలువైన బంగా రు, వెండి ఆభరణాలను అపహరించారు. కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ వైపు సీసీ కెమెరాల పరిశీలన, మరో వైపు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల సమాచారాన్ని సేకరించారు. నిందితులంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారీగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం పాణ్యం స్టీల్ ప్లాంట్ వద్ద మహమ్మద్ ఇమ్రాన్, షేక్ మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ నజీర్, సయ్యద్ సైదుల్లా, మహమ్మద్ షేక్షాను అరెస్టు చేయగా, తెలంగాణాలోని రాజేంద్రనగర్ పరిధిలో మహిర్ దేవులపల్లిని చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ తన నలుగురు స్నేహితులతో కలసి బొలెరో వాహన యజమాని మహమ్మద్ ఇబ్రహీంతో చేతులు కలిపి చోరీకి పాల్పడ్డారు. చోరీ సమయంలో బొలెరే వాహనం నంబర్లు మార్చుతూ ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి కొద్ది రోజుల ముందు అవుకు సమీపంలో జరిగినా ఒక ఉరుసులో వీరందరూ పాల్గొన్నారని, ఆ సమయంలో ఈ బంగారు దుకాణంలో చోరీకి పథకం వేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పనను డీఎస్పీ అభినందిస్తూ, త్వరలో ఎస్పీ ద్వారా రివార్డులు అందజేస్తామన్నారు. బంగారు దుకాణ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు.


