మన అడవిని మనమే రక్షించుకోవాలి
ఆత్మకూరురూరల్: నల్లమల అడవి అందరిది అని, సంరక్షణ బాధ్యత విషయాన్ని తప్పక గుర్తించాలని నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆత్మకూరు డివిజన్లోని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివభక్తులను కలసి అటవీ సంరక్షణ గురించి వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలానికి భక్తులు కాలినడకన వెళ్లడం ఒక పురాతన ఆధ్యాత్మిక కార్యక్రమన్నారు. అటవీ చట్టాలను అమలయ్యే సమయంలోనే ఈ పాదయాత్ర మార్గంలో శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు వెళ్లేందుకు హక్కు కల్పించారన్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అటవీ రక్షణకు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. అడవుల్లోకి ప్లాస్టిక్ను పకడ్బందీగా నివారించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందన్నారు. భక్తులు అడవిలో పారవేసే ప్లాస్టిక్ వస్తువులను వన్యప్రాణులు తిని మృత్యువాత పడుతాయన్నారు. కేవలం 30 శాతం సిబ్బందితోనే అటవీ సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, ఈ విషయాన్ని భక్తులు గమనించి అటవీ శాఖకు సహకరించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పర్యావరణ పరిరక్షణ విషయాలు చర్చించారు. ఆయన వెంట డీడీ విగ్నేష్ అపావ్, ఎఫ్ఆర్ఓలు ప్రణీతాబాయి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డయాగ్నోస్టిక్ సెంటర్లో వ్యాక్సినేషన్ చేశారు. వీరికి మెనింగో కోకల్, సీజనల్ ఇంఫ్లూయెంజా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన అన్ని వైద్యచికిత్సలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలను డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఐఓ డాక్టర్ ఉమా అందించారు. మొత్తం 155 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, స్థానిక హజ్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


