శ్రీశైలం టెంపుల్: చంద్రగ్రహణం పూర్తవడంతో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీశైల ఆలయ ఉభయ దేవాలయాల ప్రధాన ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి చేశారు. అనంతరం అర్చకులు, వేదపండితులు సంప్రోక్షణ నిర్వహించారు. 7.30 గంటల నుంచి భక్తులను స్వామి వారి దర్శనాలకు అనుమతించారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పీపీ మధు
బొమ్మలసత్రం: ప్రొద్దు టూరు, డోన్ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య దర్శిగా పీపీ మధుసూదన్రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలానికి చెందిన పీపీ నాగిరెడ్డి సోదరుని కుమారుడు పీపీ మధుసూదన్రెడ్డి పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో ఆయనకు ప్రొద్దుటూరు, డోన్ నియోజకవర్గాలకు సంబంధించి రీజినల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుల సహాయకారిడిగా వ్యవహరించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
నాణ్యమైన విద్యుత్ అందించాలి
నంద్యాల(అర్బన్): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్రావు అన్నారు. ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడితే అందుకు లైన్ ఇన్స్పెక్టర్లదే బాధ్యత అన్నారు. ఆ తర్వాత సంబంధిత ఏఈ బాధ్యునిగా చేర్చుతామన్నారు. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదన్నారు. నంద్యాలలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జిల్లా స్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బందితో విద్యుత్ వినియోగంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల పరిష్కారం, వినియోగదారులకు సిబ్బంది అందుబాటులో ఉండటంపై నిర్వహించిన సర్వేలో జిల్లాకు 68 శాతం మంది మాత్రమే ఆమోదం తెలిపారన్నారు. దీనిని 90 శాతానికి పెంచేలా చూడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎస్ఈ సుధాకర్కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు, డోన్ ఈఈలతో పాటు ఏడీలు, ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
హిజ్రాలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ
నంద్యాల(అర్బన్): స్వయం ఉపాధి, నైపుణ్యం అభివృద్ధి రాణించేందుకు హిజ్రాలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు రయిన్ ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ సెంచరీ, సాఫ్ట్వేర్ సెల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియెట్ లెవెల్ కోర్స్ల్లో ఆప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టిస్ టెస్టులు ఉంటాయన్నారు. డిగ్రీ లెవెల్ కోర్స్ల్లో అడ్వాన్స్ అప్టిట్యూడ్, న్యూస్ పేపర్ అనాలసిస్ట్, కంప్యూటర్ ప్రావీణ్యాలు ఉంటాయన్నారు. జిల్లాలోని హిజ్రాలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 08518–277864ను సంప్రదించాలన్నారు.

శ్రీశైల ఆలయంలో సంప్రోక్షణ