పాములపాడు: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా రైతులకు యూరియా అందడం లేదు. సోమవారం ఉదయం మద్దూరు ప్రాథమిక రైతు సేవా సహకార సొసైటీ కార్యాలయానికి యూరియా కోసం రైతులు వెళ్లారు. కార్యాలయం తలుపులు తెరవకపోవడంతో పక్కనే ఉన్న గ్రామ సచివాలయం వద్ద కూర్చున్నారు. సాయంత్రం అయినా యూరియా ఇవ్వలేదు. మంగళవారం ఇస్తామని అధికారులు తాపీగా చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సమస్య ఎప్పుడూ రాలేదని, కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలు వచ్చాయని ఆరోపించారు. అదనులో యూరియా వేయాలని, లేదంటే పైర్ల పెరుగుదల క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్ కోసం అవ్వ ప్రదక్షిణ
కొలిమిగుండ్ల: వృద్ధాప్య పింఛన్ తీసుకునే భర్త గంగిరెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందినా అవ్వ సారెడ్డి నాగమ్మకు ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెకు ఈ వృద్ధురాలు పేదరాలు. తనకు తనకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆలయాల చుట్టూ ప్రదణక్షిణ చేస్తున్నారు. అయితే కొత్త పింఛన్లకు ఇంకా వెబ్సైట్ ఓపెన్ కాలేదని అధికారులు చెబుతుండటంతో ‘తనకు దిక్కెవరు’ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఎండుతున్న వర్షాధార పంటలు
జూపాడుబంగ్లా: వర్షాధారం కింద సాగుచేసిన పంటలు ఎండిపోతుండంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఖరీఫ్లో ముందుస్తుగా కురిసిన వర్షాలతో మొక్కజొన్న సాగుచేశారు. జూపాడుబంగ్లా మండలంలో 1,570 ఎకరాల్లో పైరు బాగా పెరిగింది. అయితే నెలరోజులు కావొస్తున్నా వర్షాలు కురవకపోవటంతో పైర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.20వేలు ఖర్చు చేశామని, నష్టమే వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు త్వరగా ఈక్రాప్ బుకింగ్ చేసి పంట నష్ట పరిహారం వర్తించేలా చేయాలని కోరుతున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ లోపల దరఖాస్తులు ఎంఈఓల ద్వారా సమర్పించాలని పేర్కొన్నారు. ఎలాంటి అభియోగాలు లేని, పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అవార్డులకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా, డైట్ ప్రిన్సిపాల్ ఎన్జీఓ ప్రతినిధి, జిల్లా అధికారి సభ్యులుగా ఎంపిక కమిటీ ఉంటుందని పేర్కొన్నారు.
ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
నంద్యాల: ప్రజల ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్లో 97 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిష్కరించాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు అందని యూరియా