షెడ్యూలింగ్ ఉంటేనే జొన్నల కొనుగోలు
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్
నంద్యాల(అర్బన్): రైతు సేవా కేంద్ర పరిధిలో వ్యవసాయ సిబ్బందితో షెడ్యూలింగ్ చేస్తేనే జొన్నలు కొనుగోలు చేయాలని, లేదంటే వద్దని అధికారులకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. షెడ్యూల్ లేకుండా రైతులు జొన్నలను అన్లోడింగ్ గోడౌన్కి తీసుకొని వచ్చి రెండు మూడు రోజులు నిరీక్షించవద్దని సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. మద్దతు ధరతో జిల్లాలో 30 వేల టన్నుల జొన్నల కొనుగోలుకు అనుమతి ఉందన్నారు. ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేశారని, ఇంకా 25 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందన్నారు.
5 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు
నంద్యాల(న్యూటౌన్):ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఈనెల 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని డీఐఈఓ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆయా కళాశాలల్లోనే విద్యార్థులు ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలపై ముస్లింల ఆగ్రహం
● నేడు కర్నూలులో ధర్నా
కర్నూలు(సెంట్రల్): ‘ముస్లమాన్లందరూ టెర్రరిస్టులే’ అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల చరిత్ర తెలియక లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఆయనకు భావ్యం కాదన్నారు. డిప్యూటీ సీఎం మాట లను నిరసిస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జమ్మిచెట్టు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం సంఘాల జేఏసీ నాయకుడు ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు.
ఎంపీహెచ్ఏల కౌన్సెలింగ్ వాయిదా
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్)ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. శనివారం నిర్వహించాల్సిన రీ డిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్లో పలువురు హెల్త్ అసిస్టెంట్లు కొన్ని సందేహాలను లేవనెత్తారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాగా జాబితాను వేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ మాత్రమే కేవలం కర్నూలు జిల్లా జాబితాను తయారు చేశారని చెప్పారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వివరణ తీసుకుని డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు.
ముగ్గురికి జూనియర్
అసిస్టెంట్లుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ జెడ్పీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు రికార్డు/లైబ్రరీ/ ల్యాబ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరిని మండల పరిషత్ కార్యాలయాలు, పాఠశాలలకు కేటాంచినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. ఎన్.కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.వీరశేఖర్రాజును జెడ్పీహెచ్ఎస్ బలపనూరుకు, దేవనకొండ నుంచి ఎం.అన్వర్సాదత్ను జూపాడుబంగ్లా ఎంపీపీ కార్యాలయానికి, బనగానపల్లె నుంచి ఎస్.జాకీర్హుసేన్ను ఎంపీపీ కోవెలకుంట్లకు పదోన్నతిపై బదిలీ చేసినట్లు సీఈఓ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అక్రమ కుళాయి కనెక్షన్ తొలగింపు
ఆలూరు: మొలగవెల్లి గ్రామంలో దేవాలయ నీటిని టీడీపీ నాయకుడు ఇంటికి తరలిస్తుండగా అధికారులు స్పందించారు. మంచినీటి కుళాయి కనెక్షన్ను శనివారం తొలగించారు. భక్తులకు ఇచ్చే నీటిని అక్రమ కనెక్షన్తో టీడీపీ నాయకుడు తన ఇంటికి తరలిస్తున్నాడు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే కుళాయి కనెక్షన్ తొలగించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడిని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది రామాంజనేయులుతో కలసి కుళాయి కనెక్షన్ తొలగించారు.


