నడిగూడెం : నడిగూడెం, కరివిరాల, చెన్నకేశ్వాపురం నిమ్మ మార్కెట్లలో నిమ్మ కాయల ధర వారం రోజులుగా కిలోకు రూ.100 పలుకుతోంది. రూ.70 ఉన్న ధర ఒక్కసారిగా అదనంగా రూ.30 పెరగడంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నడిగూడెం మండల కేంద్రంతో పాటు, చెన్నకేశ్వాపురం, వేణుగోపాలపురం, కరివిరాల, బృందావనపురం, రామాపురం, యఖలాస్ఖాన్పేట తదితర గ్రామాలలో దాదాపు 2500 ఎకరాలకు పైగా నిమ్మ సాగులో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మకు ఈ ఏడాది తెగుళ్లతో పాటు, నల్లి, తామర పురుగులు ఆశించాయి. దీనికి తోడు వాతావరణంలో మార్పుల్లో భాగంగా పొగ మంచుకురవడం, రాత్రి వేళలో చలి తీవ్రంగా ఉండడంతో పంట దిగుబడి, కాతపై ప్రభావం పడిందని పలువురు రైతులు వాపోతున్నారు. పూత, కాత సరిగ్గా రాకపోవడంతో పంట దిగుబడులు పడిపోయాయని ఆందోళ వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గినప్పటికి నిమ్మకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


