నల్లగొండ టూటౌన్ : స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ, మైనార్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 56 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని 40 రోజులపాటు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను అందించారు. అనంతరం కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చొరవతో నల్లగొండకు 1,152 కుట్టు మిషన్లు వచ్చాయన్నారు. మొదటి విడతలో 56 మందికి 100 శాతం సబ్సిడీతో పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతావి విడతలవారీగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మిషన్లు తీసుకున్న మహిళలు వాటిని వినియోగించుకొని స్వయం ఉపాధి పొందాలన్నారు. సెట్విన్ ద్వారా మహిళలకు బ్యుటీషియన్, టైలరింగ్తో పాటు వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మైనార్టీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ రవీందర్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


