నల్లగొండ : అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ (గృహ అవసరాలు) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్యాస్ సరఫరా లేదన్న సాకుతో జిల్లాలోని హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల భోజనానికి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రిన్సిపాళ్లను, సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. గ్యాస్ సక్రమ సరఫరా, పర్యవేక్షణ విషయమై ప్రభుత్వం జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్బంగా ఆయన శనివారం గ్యాస్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీలు సీనియార్టీ ప్రకారం గ్యాస్ సరఫరా చేయాలన్నారు. జిల్లా దాటి ఇతర ప్రాంతానికి గ్యాస్ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా కమర్షియల్ సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు జిల్లాస్థాయి కమిటీ తీర్మాణించిందన్నారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాంపతి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


