బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. అభివృద్ధి బాధ్యత తనదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని ఒప్పించి నల్లగొండకు నిధులు తెస్తానన్నారు. నల్లగొండలో మంత్రి ఉన్నా.. 30 ఏళ్ల కిందట బీజేపీ చైర్మన్ కృష్ణారెడ్డి చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీ గాలి వీస్తోందని, దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలను మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తానని చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి.. హామీలను మూసీలో ముంచాడన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ సొమ్ములో వాటాల కోసమే కేసుల దర్యాప్తును సాగదీస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, గోలి మధుసూదన్రెడ్డి, శ్యాంసుందర్, పిల్లి రామరాజుయాదవ్, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఫ మోదీని ఒప్పించి నల్లగొండకు నిధులు తెస్తా
ఫ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్


