భూదాన్పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లి గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నర్సింహ, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె కప్పెర సంతోష(18)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కాగా సంతోష తల్లి మల్లమ్మకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయమై సంతోష తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండేవారు. అంతేకాక కుమార్తె సంతోషకు తల్లి మల్లమ్మ ప్రతి రోజూ ఫోన్ చేసి భర్తను వదిలేసి వస్తే మంచి సంబంధం చూసి తిరిగి పెళ్లి చేస్తానని చెప్పేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష సోమవారం భర్త నర్సింహ బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment