నాగర్కర్నూల్: ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం అధికారులకు సూచించారు. ఈ నెల 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి అన్నిశాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని, సభావేదిక అలంకరణ, ప్రొటోకాల్ ప్రకారం వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఆహ్వాన పత్రికల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ ఉన్నారు.


