ఉద్యమకారుల పురిటిగడ్డ కొల్లాపూర్. ఈ ప్రాంతంతో కుటంబ బంధుత్వం ఉన్న సురవరం ప్రతాపరెడ్డి 1938లో ఆంధ్రమహాసభ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1942లో ఆయన జిల్లా నేతలతో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ విమోచనం కోసం కొల్లాపూర్కు చెందిన అనంత రాంచంద్రారెడ్డి, సీఆర్ శర్మ, చక్కెర కిష్టయ్య, కందాళ లక్ష్మణాచారి, చిన్నలింగారెడ్డి, పెద్దలింగారెడ్డి, మాసయ్య, తప్పెట బుగ్గన్న, ఎరుకలి మంగమ్మ, కొండ్రావుపల్లి సాయన్నగౌడ్, జవాయిపల్లికి చెందిన కటికనేని గోపాలరావు, సింగోటం గ్రామానికి చెందిన డి.కిష్టన్న వంటి నేతలను సంఘటితం చేసి కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషిచేశారు. చాలామంది నాయకులు కర్నూలు జిల్లాలో తుపాకీ వినియోగం వంటి సాయుధ శిక్షణ పొందారు. దీంతో నక్సలిజం వ్యాప్తికి కృషిచేస్తున్నారనే అభియోగంతో లక్ష్మణాచారి, కిష్టన్నతో పాటు కొందరు నాయకులను నిజాం సైన్యం అరెస్టు చేసి వరంగల్ జైలుకు తరలించింది. జైలు నుంచి తప్పించుకున్న లక్ష్మణాచారి, సురవరం వెంకట్రామిరెడ్డితో కలిసి కొల్లాపూర్ చేరుకుని గెరిల్లా పోరాటాలకు శ్రీకారం చుట్టారు. పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్పై దాడిచేసి, 12 తుపాకులను ఎత్తుకెళ్లిపోయారు. దాడిలో పాల్గొన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి సంగెమ్మ, కల్వకోలుకు చెందిన మిద్దె పుల్లయ్య, ఎరుకలి ముప్పయ్య, చంద్రయ్య, నక్కలపల్లికి చెందిన కిష్టారెడ్డి, కోడేరుకు చెందిన మల్లయ్యతో పాటు బుచ్చిలింగం, గొల్ల బల్రాం, బాల్లింగం, లక్ష్మయ్య, మీర్జాపర్హతుల్లాబేగ్ వంటి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతర కాలంలో నక్కలపల్లిలో పెద్దకిష్టారెడ్డి అనే వ్యక్తి చనిపోయినట్లుగా నిజాం సైన్యం గుర్తుతెలియని శవాన్ని తీసుకొచ్చి ముఖాన్ని ధ్వంసం చేశారు. కిష్టారెడ్డిని కమ్యూనిస్టులే హత్యచేశారంటూ వారిని అరెస్టు చేసేందుకు, ప్రజా ఉద్యమం నుంచి వారిని దూరం చేసేందుకు కుట్ర పన్నారు. తర్వాత కొద్దికాలానికి కిష్టారెడ్డి బతికే ఉన్నట్లు తెలిసింది. నక్కలపల్లి కుట్ర కేసును ఇప్పటికీ కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు ఉదహరిస్తుంటారు.
కటికనేని గోపాలరావు
సీఆర్ శర్మ
కె.లక్ష్మణాచారి
గొల్ల బల్రాం


