కందనూలు: ఎంజీకేఎల్ కాల్వ పరిధిలో సాగుచేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. డీ–26 కాల్వ ఎగువన సాగునీరు అందక పంటలు ఎండుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కార్యాలయంలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాడూరు మండలం గుంతకోడూరు, తుమ్మలసూగూర్ నుంచి నడిగడ్డ వరకు 26 కి.మీ. ఎంజీకేఎల్ఐ డీ–26 కాల్వ ఉందన్నారు. అయితే 5 కి.మీ. వరకు మాత్రమే నీరు పారుతున్నాయని.. ఎగువ ప్రాంతానికి నీరు రావడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాల్వ పరిధిలో 18వేల ఎకరాల విస్తీర్ణం వరకు పంట పొలాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు స్పందించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఇరిగేషన్ ఈఈని ఫోన్లో సంప్రదించగా.. రైతులు తమ కార్యాలయానికి వచ్చినప్పుడు తాను క్షేత్రస్థాయికి వెళ్లినట్లు తెలిపారు. రైతులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నామని.. సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


