కల్వకుర్తిరూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే ప్రజాబాట కార్యక్రమం చేపట్టినట్లు ఆ శాఖ సీఈ బాలస్వామి చెప్పారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యుత్ వినియోగారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ రంగంపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా పోలిస్తే తెలంగాణలో మెరుగైన విద్యుత్ సరఫరా కొనసాగుతుందని చెప్పారు. గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయ రంగానికి 12 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం తాండ్రా విద్యుత్ సబ్స్టేషన్ను సీఈ పరిశీలించారు. ఇటీవల విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన నేపథ్యంలో ఆయన విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన విదంగా విద్యుత్ సరఫరా చేయాలని.. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ నర్సింహారెడ్డి, డీఈ సుధాకర్, ఏడీఈ శంకరయ్య, ఏఈ జానకీరామ్ ఉన్నారు.


