కందనూలు: కులరహిత సమాజ నిర్మాత బాబు జగ్జీవన్రాం నిస్వార్థ సేవకు ప్రతీక అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పాత కలెక్టరేట్ వద్ద జగ్జీవన్రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరఫున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జగ్జీవన్రాం అని కొనియాడారు. ఆయన దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడు మాత్రమే కాకుండా, సామాజిక శ్రేయస్సు కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, కులరహిత సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, దళిత సంఘాల నాయకులు వార్డెన్ చెన్నయ్య, వంకేశ్వరం నిరంజన్, జెట్టి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.


