కందనూలు: జిల్లాలో అక్షరాస్యత వందశాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులైన మహిళలు, వయోజనులకు జిల్లాలో ఇది వరకు చదువు నేర్పిన మహిళలకు ఈ నెల 29న నిర్వహించే ప్రీఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్కు విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో వందశాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారిక విద్యకు దూరమైన 15 ఏళ్లు పైబడిన వయోజనులకు చదవడం, రాయడం, లెక్కలు, ప్రాథమిక జీవన నైపుణ్యాలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. జిల్లాలో చదవడం, రాయడం నేర్చుకున్న నిరక్షరాస్య మహిళలు, వయోజనులు 25,313 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారని.. పరీక్షను జిల్లావ్యాప్తంగా సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిరక్షరాస్యుల పరీక్షలకు అవసరమైన ప్రశ్నపత్రాలను ఈ నెల 27న జిల్లాలోని పాఠశాలలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీ ఓ చిన్న ఓబులేసు, జిల్లా వయోజన విద్యాఽ దికారి శ్రీనివాస్రెడ్డి, డీఈఓ రమేష్కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రాజేశ్వరి, సీఎంఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


