రైతులకు తీరనున్న పురుగు మందుల పిచికారీ వెతలు
● జిల్లాకు పది కేటాయింపు
● సహకార, మహిళా సంఘాలకు ప్రాధాన్యం
● ఒక్కో యూనిట్కు రూ. 4లక్షల వరకు సబ్సిడీ
కందనూలు: వ్యవసాయ పొలాల దుక్కితో మొదలుకొని.. పంట చేతికొచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం పెరిగింది. యాంత్రీకరణతో వ్యవసాయ పనులు చకచకా సాగడంతో పాటు కూలీల కొరత తీరుతోంది. ప్రధానంగా పంటల్లో చీడపీడల నివారణ కోసం పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాయితీపై డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగుకు అనుకూలమైన పంట పొలాలు 8.30 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. అందులో పత్తి 2.95 లక్షలు, వరి 2.10లక్షలు, వేరుశనగ 1.05 లక్షల ఎకరాల్లో సాగుచేస్తుండగా.. మిగతా పొలాల్లో వివిధ రకాల పంటలను పండిస్తున్నారు.
నాగనూల్లో డ్రోన్ ద్వారా వరిపంటకు
పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు (ఫైల్ )
తక్కువ ఖర్చు..
సమయం ఆదా
వ్యవసాయ రంగంలో డ్రోన్లతో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లడం తేలిక. ఖర్చు తగ్గడంతో పాటు రైతులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. కూలీలతో పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా రైతు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమయం చాలా తీసుకుంటుంది. పంటలకు సకాలంలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఉపయోగించుకునేలా తయారు చేయడానికి అవకాశం కల్పించింది.
జిల్లాకు పది కేటాయింపు..
పంటలకు పురుగు మందుల పిచికారీలో నూతన విధానానికి అనుగుణంగా డ్రోన్లు వినియోగించేలా అవసరమైన శిక్షణతో పాటు పరికరాలను రాయితీపై రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో జిల్లాకు పది డ్రోన్లు కేటాయించింది. తర్వాత డిమాండ్కు అనుగుణంగా వాటి సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఒక్కో డ్రోన్ యూనిట్ వ్యయం రూ. 9.50 లక్షల నుంచి రూ. 11.50 లక్షల వరకు ఉంటుంది. ప్రతి యూనిట్కు రూ.4 లక్ష లు రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తి దారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్వవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొనుగోలులో 40 శాతం రాయితీతో గరిష్టంగా రూ. 4లక్షల వరకు సబ్సిడీ అందజేయనున్నారు. కొనుగోలు చేసిన సంఘాల నుంచి రైతులు అద్దెకు తీసుకొని తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు.


