అచ్చంపేట రూరల్/లింగాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం లింగాల మండలం మాడాపూర్లో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన పాఠశాలల స్థానాల్లో కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. మాడాపూర్లో రూ. 30లక్షలతో పాఠశాల భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామన్నారు. మండలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ సాబేరాబేగం, పంచాయతీ కార్యదర్శి లలిత, ఐకేపీ సీసీ రూప్సింగ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.
● అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.


