జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ యూనియన్ పని చేస్తోందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుందని, పాలమూరు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగిని సంఘంలో భాగస్వామిని చేస్తూ హక్కుల పోరాటంలో ఏకం చేయాలని పిలుపునిచ్చారు. డీఏ బకాయిలు ఏకకాలంలో అన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాప్యం చేయడం తగదని, పెండింగ్ బకాయిల కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఈహెచ్ఎస్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత పెన్షనర్ ఐడీలను కల్పిస్తూ, కంట్రిబ్యూషన్ లేని హెచ్ఎస్ను అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా ప్రధానకార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, రాఘవేంద్ర, వెంకటేష్ మల్లేశ్,రాజేష్, నరేష్, రాఘవేందర్ రావు, కర్నయ్య పాల్గొన్నారు.


