బల్మూర్/ వంగూరు: ప్రతిఒక్కరూ అహంకారాన్ని వీడితేనే దేవుడి అనుగ్రహం పొందుతారని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామానుజ చినజీయర్స్వామి అన్నారు. మండలంలోని కొండనాగులలో సోమవారం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఆలయ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మారుమూల నల్లమల ప్రాంతమైన కొండనాగుల వంటి గ్రామాల్లో హరిజన, గిరిజనులు భక్తిభావంతో ఆలయ నిర్మాణం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి గ్రామంలో మందిరాలను నెలకొల్పి దేవతామూర్తులను ఆరాదించి అనుగ్రహం పొందాలని సూచించారు. ప్రధానంగా మహిళలు ఆధ్యాతికత వైపు మొగ్గు చూపితేనే కుటుంబాలు అభివృద్ధి పరంగా పురోగతి సాధిస్తాయన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి అద్భుతమైన పురాతన ఆలయాలు ఎంతో కీర్తి ప్రతిష్టలతో గుర్తింపు పొందాయన్నారు. అనంతరం సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
● వంగూరు మండలంలోని ఎల్లమ్మ రంగపూర్ ఆలయంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చినజీయర్స్వామి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, నాయకులు రాజేందర్రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


