నాగర్కర్నూల్ క్రైం/ కందనూలు: హోలీ పండుగను సహజ రంగులతో పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ మదన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకో– ఫ్రెండ్లీ హోలీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే రసాయన ఆధారిత రంగులు చర్మం, కళ్లు, శ్వాసకోశానికి హానికరమన్నారు. చిన్నపిల్లలు, యువత రసాయన రంగులతో ఆడితే చర్మ అలర్జీలు, దద్దుర్లు, కంటి ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కొన్నిరంగుల్లో ఉండే సీసం, పాదరసం వంటి లోహాలు దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయని హెచ్చరించారు. ప్రతిఒక్కరు పూలు, కూరగాయలు, పసుపు, కుంకుమ, బీట్రూట్, పాలకూర వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ పండుగను ఆనందంగా, ఆరోగ్యకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాల్చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఉపాధ్యాయలు అంజయ్య, వనిత, ఉమాదేవి, దశరథం, శోభారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ వసంత హాజరై విద్యార్థులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకొన్నారు.


