చిన్నారులకు వ్యాక్సిన్లు తప్పనిసరి
నాగర్కర్నూల్ క్రైం: వ్యాక్సిన్లను నిర్ణీత ఉష్ణోగ్రతలో భద్రపర్చడంతోపాటు చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఇన్చార్జి అధికారి శివ అన్నారు. మండలంలోని పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి.. వ్యాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ నిర్వహణ విధానం, ఇమ్యూనైజేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్లను నిర్ణీత ఉష్ణోగ్రతలో భద్రపరచడం, స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం, పిల్లలు, గర్భిణుల ఇమ్యూనైజేషన్ వివరాలు సక్రమంగా ఆన్లైన్లో నమోదు చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి వాణి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఫార్మసీ అధికారి సురేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
శనేశ్వరుడికి
ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరాలయంలో భక్తులు శని నివారణ పూజలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత శని నివారణ పూజలు భక్తిశ్రద్ధలతో జరిపించారు. అనంతరం భక్తులు బ్రహ్మసూత్ర పరమేశ్వరుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అధ్యాపకులు పనితీరును మెరుగుపర్చుకోవాలి
బిజినేపల్లి: అధ్యాపకులు తమ పని విధానాన్ని రికార్డుల్లో నమోదు చేయడం కాదని.. విద్యార్థుల మనస్సులో తమ బోధనలు రికార్డు అయ్యేలా పనిచేయాలని పాలమూరు ఎంవీఎస్ కళాశాల తెలుగు శాఖ హెచ్ఓడీ కృష్ణమూర్తి, పెబ్బేరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ప్రసాద్ అన్నారు. శనివారం పాలెంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలను హైదరాబాద్ సీసీఈ ఆదేశానుసారం 2022– 23, 24 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఆడిట్ నిర్వహించి.. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారులు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలను అధిగమించాలంటే ప్రభుత్వ కళాశాలలు ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుష్మ, లైబ్రేరియన్ శ్రీనివాసులు, అధ్యాపకులు స్వప్న, నాగలింగ్, వెంకటేష్, రమేష్, ప్రవళిక, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష ఫీజు చెల్లించండి
కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లాకేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్, అధ్యయన కేంద్రం సమన్వయకర్త అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 27 వరకు ఆన్లైన్లో చెల్లించి, రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. 5వ సెమిస్టర్ పరీక్ష ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు, 3వ సెమిస్టర్ పరీక్ష 13 నుంచి 20 వరకు, 1వ సెమిస్టర్ పరీక్ష 22 నుంచి 28 వరకు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
● ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించాలని డీఈఓ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025– 26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన, గతంలో ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 26 వరకు మీ సేవ, ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ శివప్రసాద్ (సెల్ నం.98856 83314)ను సంప్రదించాలని సూచించారు.
చిన్నారులకు వ్యాక్సిన్లు తప్పనిసరి
చిన్నారులకు వ్యాక్సిన్లు తప్పనిసరి


