పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం

Sep 14 2025 6:23 AM | Updated on Sep 14 2025 6:23 AM

పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చా

పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చా

గద్వాల: ‘తన తలను రైలు కింద పైట్టెనా చనిపోతా కానీ, కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్‌ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు.. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. సొంత అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని రాబోయే ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని’ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం కేటీఆర్‌ గద్వాల పర్యటన సందర్భంగా ముందుగా జిల్లాకేంద్రంలోని ప్రధాన మార్గంలో ర్యాలీ తీసి.. తేరు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే బండ్ల ఈ రెండేళ్ల కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో.. నియోజకవర్గానికి ఒక్క రూపాయి వచ్చిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలు ఎగ్గొట్టినందుకు పార్టీ మారాడా? రైతుబంధు రూ.15 వేలు ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఆసరా పింఛన్‌ ఇవ్వనందుకు పార్టీ మారాడా? షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకం కింద ఆడపడుచులకు తులం బంగారం ఇవ్వనందుకు పార్టీ మారాడా? ఎందుకు పార్టీ మారాడో ఎమ్మెల్యే బండ్ల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంకా సిగ్గులేని విషయం ఏమంటే తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానంటూ చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి సంకలో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు. 2014లో గద్వాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు, గురుకులాలు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, 1,275 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి ఇలా అన్ని రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పంటలు సాగు చేసుకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడొద్దని ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుబంధు వారి ఖాతాలో జమచేశామని, పేదింటి ఆడబిడ్డలు ఇబ్బందులు పడొద్దని షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలు, దళితబంధు వంటి పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు.

‘‘ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని

పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాం. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకే వలస వచ్చేలా కృషి చేశాం. గతంలో గద్వాల ప్రాంతానికి వచ్చిన క్రమంలో రోడ్డు పక్కనున్న పొలంలో పనులు చేస్తున్న కూలీలను పలుకరించి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే కర్ణాటకలోని రాయచూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి వచ్చినట్లు చెప్పారు.’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడు బీళ్లు.. నేడు సిరులు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని బహిరంగ సభలో ప్రదర్శించారు. అలాగే సీడ్‌ పత్తి రైతులకు అండగా ఉంటామని సీడ్‌ కంపెనీలు పెట్టే ఇబ్బందులు తొలగిపోయేలా బీఆర్‌ఎస్‌ పార్టీ రైతులకు అండగా ఉంటుందని కేటీఆర్‌ చెప్పారు.

కష్టకాలంలో పార్టీకి అండగా..

గద్వాలలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాసు హనుమంతు అండగా నిలబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు పార్టీలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. అలంపూర్‌ నియోజకవర్గం రాజోళిలో ఇథనాల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకించినందుకు 15 మంది రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. నిర్మల్‌లో రద్దు చేసిన విధంగా ఇక్కడ కూడా ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలని, ఆ ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తూ రెతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, అంజయ్య, స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, బాసు హనుమంతు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం

సొంత అభివృద్ధి కోసమే ‘బండ్ల’ పార్టీ మారాడు

ఉప ఎన్నికల్లో ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించండి

గట్టు ఎత్తిపోతలను పండబెట్టారని మండిపాటు

గద్వాల జిల్లాతో సహా మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు, గురుకులాలు, ఆస్పత్రుల ఏర్పాటు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

గట్టు మండలంలో 35 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి 40 శాతం పనులు పూర్తిచేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఎత్తిపోతలను పండబెట్టిందని దుయ్యబట్టారు. మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఉప ఎన్నికల కంటే ముందుగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తా యని గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయని ఇందులో కనీసం 30 వార్డులు గెలిపించాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement