
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
రైతులకు న్యాయం చేస్తాం..
నియోజకవర్గానికో ఏటీసీ..
ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి
● ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే..
● ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా..
● అప్పుడే వలసలు ఆగుతాయి..
● ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో
సీఎం రేవంత్రెడ్డి
● ‘కొడంగల్’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం
పాలమూరుకే మొదటి ముద్ద..
పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు.
భవిష్యత్లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్ట్లను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి.
ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను.
నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్లకు గ్రీన్చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
కర్ణాటక సరిహద్దులో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్, నారాయణపేట, కొడంగల్. ఈ ప్రాంతానికి నీళ్ల కోసం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 69 జీఓ ద్వారా తెచ్చుకుంటే ఎంపీగా పనిచేసిన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాజెక్టును తొక్కిపెట్టి అన్యాయం చేశారు. అందుకే సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్కు టెండర్లు పిలిచి ముందుకు వెళుతుంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారు. కొడంగల్లో కోల్పోయినవి కమర్షియల్ భూములు కావడంతో అక్కడి వారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రూ.11 లక్షల వరకు ఇచ్చాం. నారాయణపేటలో రూ.14 లక్షలు ఇస్తున్నాం. భూసేకరణకు సంబంధించిన వివాదాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులతో మాట్లాడాలి.. భూసేకరణ విషయంలో వారంపాటు సమయం కేటాయించి రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించి.. మంచి పరిహారం అందించాలి. భూములు కోల్పోతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. రైతులకు నష్టం జరిగితే మాకు జరిగినట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్తో పాటు వికారాబాద్– కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేసుకోకపోతే, పాలమూరు–రంగారెడ్డి, బీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్ట్లు పూర్తి చేసుకోకపోతే.. ఎప్పుడూ పూర్తి చేసుకోలేం. నిధుల ఇబ్బందులు ఉన్నా.. మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందజేస్తున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎస్జీడీ టెక్నాలజీస్ ఎండీ దీపక్ సర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఎడ్యుకేషన్.. ఇరిగేషన్