ములుగు: ములుగు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను కమిషనర్ సంపత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, హాస్టల్ గదుల పరిశుభ్రత, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ, రికార్డులతో పాటు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనిఖీలో కమిషనర్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్, తదితరులు ఉన్నారు.


