భూపాలపల్లి అర్బన్: సింగరేణి గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం కారణంగా పలు నియర్–మిస్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. తాత్కాలికంగా డిటోనేటర్లను నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ డిటోనేటర్లతో మైనింగ్ సిబ్బంది, ముఖ్యంగా షార్ట్ ఫైరర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అండర్ గ్రౌండ్లో తడి ప్రదేశాల్లో బ్లాస్టింగ్ ఆపరేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్లలో డిజిటల్ సందేశాలు కొన్నిసార్లు తప్పుగా ప్రదర్శించబడుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జి శ్రీనివాస్, బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోశం పాల్గొన్నారు.


