ములుగు: పౌర సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూతన డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని ఈ డిస్ట్రిక్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. జిల్లా పరిధిలోని మీసేవ ఆపరేటర్లకు సదరం (యుడీఐడీ) పోర్టల్ పైన శనివారం కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా దేవేందర్ హాజరై మాట్లాడారు. ఇకపై పౌర సేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఆదాయం, కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, లేట్ రిజిస్ట్రేషన్ బర్త్, డెత్, అగ్రికల్చరల్ మార్కెట్ వాల్యూ, గ్యాప్ సర్టిఫికెట్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుదారుడి మొబైల్కు ఎస్ఎంఎస్ ద్వారా లింక్ వస్తుందన్నారు. లింక్ ఓపెన్ చేస్తే దరఖాస్తుదారుని వివరాలతో రశీదు ఉంటుందన్నారు. సర్టిఫికెట్లు చేతికి వచ్చేవరకు ఎస్ఎంఎస్ సురక్షితంగా ఉంచుకోవాలన్నారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి, మిగతా ఆన్లైన్ సర్వీస్లను ప్రజలకు అందించాలని సూచించారు. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ను మీ సేవ ఆపరేటర్లు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్లు విజయ్, రాకేష్, జిల్లా మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.
అధిక రుసుం వసూలు చేస్తే
కఠిన చర్యలు
ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్


