వెంకటాపురం(ఎం): సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, హైరిస్క్ గ్రామాలను గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా సురక్షిత ప్రసవం పొందేలా ముందస్తుగానే తేదీలకు అనుగుణంగా ఆస్పత్రులను అనుసంధానం చేస్తూ నిరంతరం ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పర్యవేక్షించాలని తెలిపారు. ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని 31 పోలియో కేంద్రాల ద్వారా 2,400 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రామప్ప దేవాలయ ఆలయ ప్రాంగణంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాన్సిట్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలోని 14 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాడిశెట్టి శ్రీనివాస్, పల్లె దవాఖాన వైద్యాధికారి అనిత, పీహెచ్ఎన్ఓ శోభ, హెల్త్ సూపర్వైజర్ పుష్పకుమారి, ఫార్మసిస్ట్ రాజమణి, నర్సింగ్ ఆఫీసర్ ఉష, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్


