ములుగు రూరల్: జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ నాగేంద్ర అన్నారు. ఈ మేరకు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత బానిసగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగించడం, విక్రయించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1098 లేదా 14446 నంబర్లకు సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ జిల్లా అధికారి ఓంకార్, నషా ముక్త్ భారత్ పెసిలిటేటర్ అనూష, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ పాల్గొన్నారు.


