ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని ములుగు రెవెన్యూ డివిజన్ అధికారి, ఈఆర్ఓ కృష్ణవేణి కోరారు. బుధవారం కలెక్టరేట్లో ములుగు నియోజకవర్గ పరిధి లో నమోదిత రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాల సేకరణ కోసం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం జూన్ 25వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల సిబ్బందికి రాజకీయ పార్టీల నాయకులు సహకరించి అర్హులైన ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నమోదిత రాజకీయ పార్టీల నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు–1 తమ పార్టీకి సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్లు–2లకు గుర్తింపు కార్డులు జారీ చేసి అందజేయాలని తెలిపారు. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు చురుకుగా పాల్గొని ఎన్నికల సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల సూపరింటెండెంట్ సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు ఆర్డీఓ కృష్ణవేణి


