వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మండలంలోని జవహర్నగర్ మోడల్ స్కూల్ను కలెక్టర్ మంగళవారం సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యాబోధన విధానాలను పరిశీలించారు. పాఠశాలలోని కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులు ప్రయోగాత్మక విద్యపై అవగాహన పెంపొందించుకునేలా ల్యాబ్లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. లైబ్రరీని సందర్శించి, విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించేందుకు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రణాళికతో బోధన చేయాలన్నారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గోవిందరావుపేట మండల పరిధిలోని పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి సీజనల్ వాధుల నియంత్రణకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


