ములుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, యువత డ్రగ్స్ బారిన పడకుండా అన్ని శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తర చూ ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వేగ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు వేగంగా అందుబాటులో ఉండేలా వైద్యశాఖ, ట్రాఫిక్, పోలీస్శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, ఎకై ్సజ్, అటవీ, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ప్రజా ప్రదేశాల పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత శాఖలు పరస్పర సమాచారాన్ని పంచుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆధార్ మాని టరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆధార్ సేవల పురోగతి, చిన్నారుల ఆధార్ నమోదు, విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ


