ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్ మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొగి బాబు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎంఎస్ హాస్టల్ లేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందేశ్, కీర్తన, సింధు, ఉష, వర్ష తదితరులు పాల్గొన్నారు.


