● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ఫుడ్సేఫ్టీ ప్రమాణాలను తప్పకుండా అమలుచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీపై సోమవారం జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాలు తయారీ చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పనిచేసే సిబ్బందికి ప్రతీ మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వీధి ఆహార విక్రయ కేంద్రాలను ప్రతీ వారం కనీసం 10 నుంచి 15 వరకు తనిఖీ చేసి ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్జీ, సంపత్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు హెల్త్ ప్రొఫైల్ పరీక్షలు
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత హెల్త్ ప్రొఫైల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తారని కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరేట్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఉచిత హెల్త్ ప్రొఫైల్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో కలెక్టర్ సైతం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు పోలు రాజు, కందుల జీవన్కుమార్, మేడి చైతన్య, ప్రకాశ్రెడ్డి, కొమురయ్య, రాజు, శిరీష, శైలజ తదితరులు పాల్గొన్నారు.


