● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ఏటూరునాగారం: ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో డీడీ, డీటీడీఓలు, ఏటీడీఓలు, హెచ్ఎంలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ బడిబాట కార్యక్రమంలో భాగంగా చేర్పించిన పిల్లల వివరాలపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ గ్రామసభలను ఏర్పాటు చేసి స్థానిక సర్పంచ్, లోకల్ లీడర్స్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను భారీగా చేర్పించాలన్నారు. ఉచిత విద్య, ఆహారం, ఉచిత పుస్తకాలు, దుస్తులు విషయాలను గ్రామస్తులకు అర్ధం అయ్యేవిధంగా వివరించాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో గిరిజన విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని వివరిస్తూ ఆడ్మిషన్లను పొందాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరంలో డ్రాపౌట్లు లేకుండా చూడాలన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఉందన్నారు. మెనూ పాటించడంతో పాటు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే తల్లిదండ్రులకు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఫిరంగి, డీడీ దేశిరాం, ఎన్టీటీడబ్ల్యూ నాగసాగర్, డీటీడీఓ నారాయణరెడ్డి, ఏటీడీఓలు, ఏసీఎంఓలు, డిప్యూటీ ఈఓలు పాల్గొన్నారు.


