● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు రూరల్: జాబ్మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు నేడు(బుధవారం) ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహించనున్న జాబ్మేళా ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్మేళాలో 70 కంపెనీలు పాల్గొని విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సులభంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ విజయభాస్కర్, సీఐ దయాకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


