● తీర్మానం చేసిన నల్లగుంట
గ్రామ పంచాయతీ పాలకవర్గం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నల్లగుంట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు గ్రామంలోని పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి మాత్రమే పంపాలని కోరుతూ నల్లగుంట పంచాయతీ పాలకవర్గం మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య శ్రీదేవిశంకర్నాయక్, ఉప సర్పంచ్ మోరే లింగస్వామి మాట్లాడుతూ గ్రామంలోకి ప్రైవేట్ స్కూళ్ల వాహనాలను రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామప్రజలు, జీపీ పాలకవర్గం, విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమై ప్రభుత్వ బడికి వెళ్లాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు మెంబర్లు పొనగంటి రవి, తంగళ్లపల్లి శ్రీధర్, రమణారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు రామగిరి శ్రీనివాస్, మందల ప్రభాకర్ రెడ్డి, పోలుదాసరి రవి పాల్గొన్నారు.


