వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు, ధర్మవరం రహదారి నిర్మాణం చేపట్టాలని సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు తెలిపారు. మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెరుకూరు, ధర్మవరం రహదారికి నిధులు మంజూరైనప్పటికి అటవీ అనుమతులు లేని కారణంగా రహదారి నిర్మాణ పనులు నిలిచి పోయినట్లు తెలిపారు. కర్రె గుట్టల్లో జరుగుతున్న పనులకు అడ్డంగిగా లేని నిబంధనలు సామాన్య ప్రజల కోసం ఉపయోగపడే రహదారి విషయంలో ఎలా అడ్డు వస్తున్నాయో తెలియడం లేదన్నారు. రహదారి నిర్మాణానికి చిన్న పొదలు తప్ప పెద్ద పెద్ద చెట్లు పోవని అది తెలిసి కూడా అటవీ శాఖ నుంచి అనుమతులు ఇవ్వక పోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ రహదారిని పూర్తి చేయాలని పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినప్పటికి లాభం లేకుండా పోయిందన్నారు. జూన్ ఒకటిన రహదారి నిర్భంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బచ్చలి కృష్ణ బాబు, దామోదర్, ముత్తయ్య, చద్రశేకర, కుమారి, ఉదయ, ప్రవీణ్, కృష్ణబాబు, నరేష్ తదితరులు ఉన్నారు.


