టాస్క్లో శిక్షణ ఇచ్చే కోర్సుల వివరాలు..
నిరుద్యోగులకు నైపుణ్యాల
పెంపుపై శిక్షణ
ఏటూరునాగారం: గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)ను ఏర్పాటు చేసింది. ఇందులో యువతకు, ఇంజనీరింగ్, ఇతర గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక టాస్క్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని గతేడాది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి సీతక్క చొరవతో ఈ శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులకు వారివారి స్థాయిలో శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక కంప్యూటర్లు, ట్రైనర్స్, ఫ్యాకల్టీని నియమించి రోజు వారీగా శిక్షణ ఇస్తున్నారు.
ప్రధాన లక్ష్యం..
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం టాస్క్ లక్ష్యం. అలాగే ప్రత్యేక సేవలను సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ అంశాలలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతిఏటా వేలాది మంది యువకులు కార్పొరేట్ సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. టాస్క్ అధికార వెబ్సైట్ ద్వారా ఆసక్తి గల విద్యార్థులు, నిరుద్యోగులు, కళాశాలలు రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రత్యేక జాబ్మేళా
డిగ్రీ పూర్తి చేసి ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ పొంది.. సాంకేతిక పరిజ్ఙానం కలిగిన నిరుద్యోగులకు రెండు రోజుల క్రితం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రజాపరిపాలన జాబ్మేళా కార్యక్రమాన్ని చేపట్టి 25 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవశాలను కల్పించారు. ఇందులో భాగంగా ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఉద్యోగ నియామక పత్రాలను యువతకు అందజేశారు. వివిధ ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు ఎంపికై న జిల్లా అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. కార్పొరేట్ స్థాయి కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది.
కంప్యూటర్ శిక్షణకు హాజరైన నిరుద్యోగులు
ట్రైనర్ క్లాస్ వింటున్న నిరుద్యోగులు
సి, జావ, పైతాన్, ఎస్క్యూఎల్, ఫ్రాంట్ ఎండ్ డెవలప్మెంట్, డాటా సైన్స్, డీబీఎంఎస్ వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. అలాగే ఎస్సై, బ్యాకింగ్, పీసీ, గ్రూప్ 3, ఎస్ఎస్సీ, రైల్వేతో పాటు మరిన్ని పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయడమే టాస్క్ లక్ష్యం.
మంత్రి సీతక్క చొరవతో
గతేడాది ములుగులో ఏర్పాటు
ఇటీవల 25 మందికి ఉద్యోగాలు


