వాజేడు: న్యాయ కళాశాల సాధనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం జీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన న్యాయ కళాశాల సాధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ యువత చట్టాలు, జీఓలపై అవగాహన కలిగి ఉండాలంటే న్యాయ కళాశాల ఏర్పాటు అవసరమన్నారు. సొంది వీరయ్య ఆధ్వర్యంలో జీఎస్పీ చేసిన అనేక పోరాటాల ఫలితంగా జీవో నంబర్ 3 వచ్చిందని గుర్తు చేశారు. దీని కారణంగా ఏజెన్సీలో 100శాతం ఉద్యోగాలు ఆది వాసీలకే వచ్చాయన్నారు. నేడు అలాంటి జీవోను గిరిజనేతరుల కుట్రలతో కోల్పోయామని ఆరోపించారు. 1/70 చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా అమలు చేయకుండా ప్రభుత్వాలు ఆదివాసీలపై దండయాత్ర చేస్తున్నట్లు విమర్శించారు. ఏజెన్సీలో 100 శాతం రిజర్వేషన్లను కోల్పోకుండా కాపాడుకోవాలంటే భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఏజెన్సీ చట్టాలు, జీవోలను పరిరక్షించుకునే అవకాశం ఆదివాసీ యువతకు ఉంటుందన్నారు. అనంతరం పలు సంఘాల నాయకులు న్యాయ కళాశాల ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, చట్టాలు, జీఓలపై మాట్లాడారు. అనంతరం గోండ్వానా సంక్షేమ పరిషత్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదస్సులో జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి, ముర్రం వీరభద్రం, ఏఎన్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నర్సిమూర్తి, నాగరాజు, పూసూరు సర్పంచ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
గోండ్వానా సంక్షేమ పరిషత్
రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ


