ఎస్ఎస్ తాడ్వాయి: మండల కేంద్రంలోని తాడ్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న కాంబోజు చెరువు మరమ్మతులు వెంటనే చేపట్టాలని గ్రామ రైతులు శనివారం చెరువు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువు మరమ్మతులకు నోచుకోక పోవడంతో నీరు వృథాగా వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీరుపైనే ఆధారపడి సాగు చేస్తున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో వరి, మిర్చి తదితర పంటలకు సాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. చెరువు మరమ్మతులు చేపడితే వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చెరువు తూము, మత్తడి పూర్తిగా దెబ్బతిని లీకేజీలు ఏర్పడటంతో సాగునీరు నిరంతరం వృథాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే రానున్న వర్షాకాలంలో చెరువులో నీరు నిల్వ ఉండే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రత్యేక నిధులు కేటాయించి తూము, మత్తడి మరమ్మతులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.


