నల్లబెల్లి: మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి శివారులో శుక్రవారం త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి, ములుగు జిల్లా రాంచంద్రపురం గ్రామాల మధ్య 11 కేవీ విద్యుత్ లైన్ ఉంది. విద్యుత్ తీగలు తెగి బీడు భూముల్లో ఉన్న ఐరన్ఓర్ ఖనిజ రాళ్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఖనిజ రాళ్లకు రంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవ్వరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ తీగలను తొలగించి స్థానికుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం లైన్కు అత్యవసర మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
మంటలు అంటుకుని
ఐరన్ ఓర్ రాళ్లకు రంద్రాలు


