ఆకాశాన్ని అంటుతున్న
ఎరువుల ధరలు
ఎరువుల ధరల వివరాలు
ములుగు రూరల్: పంటల సాగుకు వినియోగించే ఎరువుల బస్తాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను ఎక్కువ మొత్తంలో పెంచడంతో రైతన్నలకు సాగు భారంగా మారనుంది. కాంప్లెక్స్ ఎరువులు 20–20–0–13, 28–28 బస్తాలపై ధరలు విపరీతంగా పెంచడంతో కొనుగోలు చేసేందుకు జంకే పరిస్థితి నెలకొంది. పంటల సాగులో తొలి, రెండో దశలో ఎక్కువ శాతం రైతులు కాంప్లెక్ ఎరువుల వినియోగిస్తారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగుకు ఎక్కువగా వినియోగించే ఎరువులపై ధరలు అధికంగా పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో కూలీల ధరలు, డీజిల్ ధరలు పెరగడం, ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడికి అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో కౌలు రైతులు పంటల సాగుకు ముందుకు రావడానికి భయపడుతున్నారు.
పాత స్టాక్ కొనుగోలు
ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్లో నిల్వ ఉన్న పాత స్టాక్ను కొనుగోలు చేసేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. 20–20–0–13 బస్తాపై సుమారుగా రూ. 300, 28–28–0 పై రూ.550 వరకు పెరిగింది. పంటల సాగు సమయం కంటే ముందుగా కొనుగోలు చేసేందుకు రైతులు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఎరువుల బస్తాలను పెరిగిన ధరలకు అనుగుణంగా అమ్మకాలు చేపట్టనున్నారు. దీంతో రైతులు ముందుగానే ఎరువుల బస్తాలను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు.
కాంప్లెక్స్ ఎరువు బస్తాపై రూ.300 నుంచి 500 వరకు పెంపు
పాత స్టాక్ ముందస్తుగా కొనుగోలు చేస్తున్న రైతులు
ఎరువులు పాత ధర కొత్త ధర
20–20–0–13 1,500 1,800
10–26–26 2,025 2,250
12–32–16 2,025 2,250
14–35–14 2,175 2,400
19–19–19 2,075 2,300
28–28–0 1,800 2,350
ఎంఓపీ 1,850 1,975


