ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించిన 10 నెలల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం పెంచడంతో పాటు గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ పథకం పేరుతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సామ ల రమ, ఆయా మండలాల మండల అధ్యక్షులు పద్మ, కమలక్క, శోభ, సరోజన, భవాని, భారతి, అమృత, రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్


