మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా కల్యాణ మండపంలో ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో జాతర వేలం పాటలను సోమవారం నిర్వహించారు. హన్మకొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో నెల రోజుల పాటు వివిధ రకాల షాపుల ఏర్పాటు, విక్రయాలకు అనుమతులు పొందేందుకు షీల్డ్, బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయాలు జరిపేందుకు హుజురాబాద్కు చెందిన ఎక్కెటి రాము రూ.2,86,666 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు నల్లగొండ జిల్లా దామరచెర్లకు చెందిన నన్నెబోయిన మల్లయ్య రూ.1,08,000 లకు దక్కించుకున్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలు, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు వరంగల్కు చెందిన సత్యనారాయణ రూ 2,25,000లు, ఫొటోలు తీసుకునేందుకు మల్లూరుకు చెందిన ముత్తయ్య రూ 5,500, చెప్పుల స్టాండ్ నర్సింహారావు రూ.6వేలకు పాడుకున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. 2025 జాతర వేలం పాటల ఆదాయం కంటే రూ.85,166 అదనపు ఆదాయం వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, ఆలయ సిబ్బంది శేషు, అజయ్ పాల్గొన్నారు.


