● తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్
ఏటూరునాగారం: జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక రిలీజియన్ కాలం ఏర్పాటు చేయాలని, కోయ భాషను 8వ షెడ్యూల్లోకి చేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏను ముట్టడించి తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆదివాసీలు యాప్ ద్వారా యూరియా బస్తాలు తెచ్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీలో యాప్ ద్వారా కాకుండా, సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో సాదాబైనామా జీవో నంబర్ 76తో ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులను నియమించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు ఆదివాసీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింత కృష్ణ, వట్టం జనార్దన్, కొమరం లక్ష్మీకాంత, చర్ప లలిత, చందా మహేశ్, కాపుల సమ్మయ్య, వట్టం సురేశ్, పొడెం నరసింహరావు, తొర్రెం సంతోశ్, లక్ష్మణ్, ఆలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


