భూపాలపల్లి అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఈ నెల 12నుంచి సమ్మె చేయనున్నట్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎన్సీకేయూస్) ఆధ్వర్యంలో కార్మికులు సింగరేణి అధికారులకు గురువారం సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రాథమిక సదుపాయాలు అందించడం లేదని ఆరోపించారు. పలుమార్లు సమస్యలు విన్నవించినా పరిష్కారం లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి నోటీసు ప్రకారం సమ్మె ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు, కార్మికులు స్వామి, సుధాకర్, సంపత్, మల్లయ్య, సదానందం, మధునయ్య, లక్ష్మి, రవి, రఘుపతి, రవి పాల్గొన్నారు.


